Pages

Saturday, March 3, 2018

గరికపాటి నరసింహారావు - ప్రసంగ సమీక్ష

ఒక అవధానికీ, ప్రవచనకర్తకీ చాలా తేడా ఉంటుంది. అవధానిగారు వేదికనెక్కి ఆయన ప్రజ్ఞనీ, ధారణ శక్తినీ బాగా ప్రదర్శిస్తూంటే పదిమందీ బాగుందనుకుంటారు. అప్పుడు ఆ పండితుడు చేసేది కేవలం కళాత్మకమైన భాషానైపుణ్య ప్రదర్శనమే తప్ప సమాజం, సంస్కృతి, దైవం, వేదాంతం మొదలైన విషయాల మీద ప్రసంగించటంగానీ (విషయాల్ని విడమర్చి చెప్పడం) ప్రవచించడంగానీ (మంచిమాట) చేయటం లేదు. ఇలాంటి అవధానం చేసే సందర్భంలో సభకి వచ్చినవారిని నవ్వించడానికి వినోదాత్మకమైన చతురోక్తులాడడమూ, మరీ ఇరకాటంలో పెడుతున్న ఒకరో ఇద్దరో పృచ్ఛకుల్నుద్దేశించి వెగటు పుట్టించనివీ, వెకిలిగా అనిపించనివీ అయిన నాలుగు ఛలోక్తులు విసరడమూ మామూలే. బాగుంటుంది కూడా.

అయితే, భాషా సంస్కృతుల విషయాల గురించి మాట్లాడడానికో, విద్యాసంస్థల స్నాతకోత్సవాలలో (graduation ceremonies) ప్రధాన వక్త (keynote speaker) గానో, లేదా ధార్మిక విషయాల ప్రవచనకర్తగానో, వేదికనెక్కినప్పుడు ఆ మనిషికి ఒక ప్రత్యేక గౌరవమివ్వబడుతుంది. గురుస్థానంలో ఉన్న అటువంటి వ్యక్తి, ఆనాడాసభకొచ్చిన వాళ్ళని ప్రత్యక్షంగానూ, ఆ రోజు ప్రసంగాన్ని కొంతకాలం తర్వాత టీవీ, వీడియో, యూట్యూబ్ లాంటి ప్రసార మాధ్యమాలలో చూసేవారిని పరోక్షంగానూ ప్రభావితం చేసే అవకాశముంటుంది. అందువల్ల ఇలాంటి "గురువు" గారిమీద "మంచివిషయాలు" మాత్రమే చెప్పే గురుతరమైన బాధ్యత ఉంటుంది. నో ఇతరాణి. అంటే మంచిమాటలు కానివీ, ద్వంద్వార్థాల మాటలూ, వివాదాస్పదమైన విషయాలూ చెప్పడమూ, ఎవరినీ వారివారి ఆకారవికారాలూ, కుటుంబ పరిస్థితులూ, ముసలి వయస్సూ, మొదలైన వాటి విషయాలపై కించపరిచేలా మాట్లాడడమూ చాలా పెద్ద తప్పు. అలాచేసే వాళ్ళు మళ్ళీ అలాంటి వేదికలెక్కి మాట్లాడడం మానుకుంటే బాగుంటుంది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, గత కొంత కాలంగా గరికపాటి నరసింహారావు గారి అవధానాలూ, ప్రవచనాలూ, ప్రసంగాలూ, టీవీ, యూట్యూబుల్లో చూసి, మంచి విషయాలు చెప్తుంటే బాగుందని సంతోషించి, అంత మంచివి కానివి చెప్పినప్పుడు, "అయ్యో ఇంత పెద్దాయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడూ ప్చ్" అనుకుని,  మరీ చెత్తగా, పదిమంది నవమానం చేస్తూ మాట్లాడినప్పుడు బాగా కోపం వచ్చి జమకూడిన ఆలోచనల్ని పదిమందితో పంచుకోడానికి. చెప్పాలంటే నరసింహారావుగారు సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలపైనా, ధార్మిక, లౌకిక విషయాలపైనా, మంచి పట్టున్నవారు. ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యమున్నవారు. ఐతే, చంద్రుడికో చిన్న మచ్చ ఉన్నట్టు, ఈయనక్కూడా ఒక మచ్చ ఉంది. అది రోజురోజుకీ పెద్దదైపోతోంది. పెద్దదైపోతూ, అతని విద్వత్, పాండిత్యాలపై అభిమానమూ గౌరవమూ ఉన్నవాళ్ళని అతని నుంచి దూరం చేస్తున్నాయి. ఎలాగో చూద్దాం. గరికపాటివారు ఏదైనా మంచి విషయం  గురించి చెప్పే సందర్భంలో బోలెడు లౌకికవిషయాలని గుర్తు చేస్తారు. మంచిదే. అలాచేస్తే, చెప్పవలసిన అసలు విషయం బాగా బోధపడుతుంది. అయితే, ఇలాటి సంగతులు చెప్పేటప్పుడు, జనాన్ని నవ్వించాలనో, లేక సంవత్సరాల తరబడి చేస్తూన్న అవధానాల వల్ల అలవాటైన (దుర్)లక్షణమో తెలీదుగానీ, అంతో ఇంతో పేరుగలవారినో, లేదా ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారినో, హద్దుకి మించి విమర్శించడం, అవహేళన చేయడం చేస్తారు. ఇలాటి శృతిమించిన ప్రేలాపన అప్పటికి కొంతమందికి నవ్వు తెప్పించొచ్చు. కానీ, లోతుగా ఆలోచిస్తే, నరసింహారావుగారి లాంటి విద్వద్వర్యులూ, గురుతుల్యులూ మాట్లాడవలసిన పద్ధతేనా ఇది అనిపిస్తుంది. ఒకసారి మంథెన సత్యనారాయణగారైతే, ఇంకొకసారి చాగంటి కోటేశ్వరరావుగారు. ఒక సందర్భంలో పిల్లలు దూరప్రదేశాలకో, ఇంకా దూరమైన విదేశాలకో వెళ్ళిపోతే, తమంత తాము స్వతంత్రంగా బ్రతుకుతున్న తలిదండ్రుల మీద. ఒక ప్రసంగంలో హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద ఊళ్ళల్లో కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులమీదైతే, ఇంకొక సభలో పొట్టపోసుకోవడానికి విదేశాలకి వెళ్ళి అక్కడే స్థిరపడిన ప్రవాసాంధ్రుల పైన. ఈయన వెటకారానికి హద్దులేదు. ఈయన విమర్శలకి ఎవరైనా బలే. పదిమందిని నవ్వించడానికి వేరే పదిమందిని అవమానించినా ఫరవాలేదు. ఇదే ఆయన సిద్ధాంతమనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=4KNr4S4f-uY&t=135s

చిన్న ఉదాహరణ. పై వీడియో చూడండి. సంస్కృతి మీద స్వదేశీ జాగరణ మంచ్ వారి వేదికపై రావుగారు చేసిన ప్రసంగమిది. ఇది సుమారు ఇరవై ఒకటిన్నర నిమిషాలుంటుంది. అంతసేపూ కూడా ఎవర్నో పొడుస్తూన్నట్టుందే తప్ప ఏదైనా మంచి విషయం చెప్పినట్లని వినిపించదు. ఒకవేళ చెప్పినా ఆయన చేసే వెటకారపు దుర్గంధంలో మంచి కొట్టుకుపోయింది.

1. వీడియో మొదలు: అసలు మన సంస్కృతి గూర్చి గొప్పగా చెప్పాలంటే ఇంకొకరి సంస్కృతిని దూషించాలా, తప్పదా? అలా చేయడం, ఎక్కడ్నుంచో వచ్చి, సనాతనధర్మం గూర్చి కొంతవరకూ తెలుసుకుని అందులో (బయటనుంచి) తప్పుగా అనిపించిన ధర్మసూత్రాల్నీ, నియమాల్నీ ఎత్తి చూపించి, కొంతమంది అమాయకుల్ని మోసగించి వారికి తమ మతం అంటగట్టిన సూఫీలదీ, మిషనరీలదీ కదా. మన అలవాటుకాదే. అయినా తెలీక అడుగుతాను. వ్యాపారం చేయడం తప్పా? హోటల్ కట్టి వ్యాపారం చేసేవాడు పాపాత్ముడూ, గుడికట్టే వాడు పుణ్యాత్ముడానా. ఇదెక్కడి వాదన. హోటల్ కట్టి పదిమందికి బ్రతుకుతెరువు చూపెడుతున్నాడు కదా ? అయినా ఈ విషయం నిజంగా వివేకానందస్వామి చెప్పినదేనా? అదెక్కడ వ్రాసేరో కొంచెం చెప్తారా, చదువుకుంటాను? నాకు తెలిసినంత వరకూ స్వామి చికాగోలో సనాతన ధర్మాన్ని పశ్చిమానికి పరిచయం చేశారేగానీ, పరమతాల్ని చులకన చేయలేదు. అలాచేస్తే ఆయన స్వామి అవరు.

2. 1:55 మార్కరు నుండీ పదిహేను క్షణాలపాటు, ఆయన తూర్పు దిక్కు పడమర కంటే ఎంత గొప్పదో చెప్తున్నారు. నిజమా ? దిక్కులలో ఉచ్ఛనీచాలున్నాయా? మరి తూర్పు సంధ్య, పడమటి సంధ్య అని రెండింటినీ ఎంతో పవిత్రంగా చూస్తాం ? తూర్పువైపు తిరిగి తత్పురుషరూపలో ఉన్న శివుడ్ని పూజిస్తే, పడమరవైపు సద్యోజాత రూపంలో ఉన్న అదే శివుడ్ని పూజిస్తున్నాం ?
మనకి పడమర ఉన్నవారు మనకన్నా హీనులైతే, మనకి తూర్పున ఉన్నవారికన్నా మనం హీనులమా? ఎందుకండీ, లేని వైషమ్యాల్ని చూపించి దిక్కులకి దోషాలు అంటగడతారు?

3. 2:08 మార్కరు : ఎవరికైనా ఎనభయ్యేళ్ళు దాటేయంటే వాళ్ళు స్విచ్చాపేసిన సీలింగ్‌ఫ్యాన్ లాంటి వాళ్ళట. సభలో అనవలసిన మాటేనా ఇది? అదీ గురుస్థానంలో ఉన్న ఒక విద్వాంసుడు. అతనేదో మంచి చెప్తారనే నమ్మకంతో వయసు పైబడిన వృద్ధులెవరైనా ఆయన ప్రసంగం వింటే? లేదా ముసలివారైన తలిదండ్రులున్న వాళ్ళెవరైనా వింటే? అయినా ఏ వయసువార్నైనా ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండండి అనొచ్చా? చచ్చిపోవడానికి ఏ వయసైతేనేంటి? తప్పు రావుగారూ!

4. 6:08 మార్కరు : కళేబరమంటే శవమా ? నిజమే? మరి మూలకూటత్రయ కళేబరా, అని లలితా సహస్రనామాలలో చెప్పుకుంటాం? కళేబరానికి శరీరము, మేను అని చెప్పేరే గానీ ప్రాణం లేని శరీరము, శవము అని చెప్పలేదే నిఘంటువులో?  గీర్వాణం తెలిసిన గరికపాటి గారు ఏం చెప్తే అదే నిజమనుకుంటారు కదా జనం. తెలుగు పంతులు తప్పు చెప్పొచ్చా?

5. 8:06 మార్కరు : ఇంక ఇక్కడ్నించీ అమెరికా మీద, అమెరికా వలసవెళ్ళిన తెలుగువారిమీద విరుచుకుపడి విశ్వరూపం చూపిస్తారు గురువుగారు. ఇక్కడ అన్నం దొరకదా, అమెరికా వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఉద్యోగరీత్యానో, బ్రతుకుతెరువు కోసమో, వేరే కారణాలవల్లో వేర్వేరు దేశాలకీ, ప్రదేశాలకీ వలస వెళతారు మనుషులు. మరి అన్నం దొరక్కేనా గోదావరొదిలి హైదరాబాదులో మకాం పెట్టేరు గరికపాటి వారు ?

పదహారు సార్లు అమెరికా వెళ్ళేరట. ప్రతీసారీ ఒంటరిగా వెళ్ళినా, క్రిందటిసారి మాత్రం తమ భార్యకి కూడా టికెట్టు కొనమని ఎంత నిక్కచ్చిగా చెప్పేరో, ఎంతో నీచమైన గూడార్థంతో చెప్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదుట. అమెరికాలో ఉన్నవారిని "ఉద్ధరించడానికే" వెళ్ళేరుట. చాలా దయామయులు.

2000 సంవత్సరంలో తానా వాళ్ళు పిలిచేరుట కానీ, వీసా రాలేదుట. అసలు వేరే దేశం వెళ్ళడానికి వీసా అనేదొకటుందని తెలీదుట గురువు గారికి. "మంచి మైకులోనీ చెడు చెవిలోనీ చెప్పమన్నారు" అని చెపుతూనే ఆయనకి చెడు అనిపించిందంతా మైకులేనే చెప్పేరు మహానుభావులు. విషయమేంటంటే చెప్పే చెడ్డంతా వివేకానందుల పేరు చెప్పి చెప్పేరు అన్యాయంగా. తానా ప్రెసిడెంట్ ఫోన్‌చేసి  "మీరు వీసారాని దురదృష్టవంతులు" అని "వెధవ ఇంగ్లీషు" లో  అన్నార్ట. దానికి ఈయనకి చాలాకోపం వచ్చింది. ఇంకేముంది? ఆయనతో ఇంగ్లీషులో మాట్లాడడానికీ, తెలుగులో చెప్పకపోవడానికీ ఆ ప్రెసిడెంట్ గారిని నానా మాటలూ అని, ఆశుకవితాధురీణులు కదా, ఒక పద్యం వ్రాసి పంపిస్తే, తానా వారు ఎంతో గౌరవంతో ఆ పద్యాన్ని వారి ఉత్సవ ప్రత్యేకసంచికలో ప్రచురించేరుట. ఆ పద్యం ఎంత సోత్కర్ష, ఏహ్యభావాలతో ఉందో చూడండి. "మెరిక ముందర (అ)మెరిక గరికపాటి". అమెరిక అంటే దిక్కుమాలిన దేశమూ, తెలివితేటలులేని మందకొడి "వెధవలు" ఉండే దేశమని అర్థంట ఈ పద్యానికి. ఆహ్వానించిన తానావారి ఇంటిపేరుట అమెరిక. ఈయన ఇంత జుగుప్సాకరంగా చవకబారు అర్థంతో వ్రాసిన పద్యమైనా తానా వారు సహృదయంతో, తమ మాతృభాషాభిమానంతో ఆ భాషలో పండితులైన శ్రీ రావు గారి మీద గౌరవంతో ఆ పద్యాన్ని ప్రచురించేరు. అయినా ఈయన అక్కసు తీరలేదు. పన్నెండేళ్ళ తర్వాత ఇంకా వెళ్ళగక్కుతున్నారు. ఇందులో ఎవరిది విశాలహృదయమో, ఎవరివి సంకుచిత భావాలో విజ్ఞులకి తెలియాలి. అసలు ఒకటి జరిగుంటుంది. ఆ తానా ప్రెసిడెంట్‌గారు అలవాటు ప్రకారం ఇంగ్లీషులో "It is unfortunate that you didn't get visa Mr.Narasimha Rao" అని పరామర్శగా అనుంటారు. అది గురువుగారు అపార్థం చేసుకుని పన్నెండేళ్ళ తర్వాత బాధ పడుతునారు.

ఇలాగే సాగుతుందీ ప్రసంగమంతా. ఒకటో రెండో మంచిమాటలు చెప్పకపోలేదు. కానీ.... అదీ సంగతి!








No comments:

Post a Comment