Pages

Wednesday, December 5, 2018

రాజ, దీని వివాహము చేయవయ్యా!

ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,
రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.
పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.
పై పద్యం పదిహేనవ శతాబ్దపు కవి కొఱవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశిక లోనిది.
(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)

No comments:

Post a Comment