Pages

Wednesday, December 5, 2018

శాస్త్రిగారి కాశీ

తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చెప్తూ, ఆయన్ని హైదరాబాద్ లో చార్మినార్ ప్రక్కనున్న ఇఱుకు సందుల్లో కోటి రూపాయల విలువైన పెద్ద పోర్షా కారుని వేగంగా నడపగలిగే నేర్పుగల డ్రైవరుతో పోల్చేరు. ఇది ఎంత సరైన పోలికో, సీతారామశాస్త్రిగారు ఇంద్ర సినిమాకి భం భం భోలే అని కాశీ నగరం మీద వ్రాసిన పాటని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది.

భం భం భోలే శంఖం మ్రోగెలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే,
తద్ధినకధిన్ దరువెయ్, సందడి రేగనీ, పొద్దులెరుగని పరుగై, ముందుకు సాగనీ
విలాసంగా శివానంద లహరి, మహాగంగాప్రవాహంగా మారి, విశాలక్షి సమేతంగా చేరి, వరాలిచ్చే కాశీపురి

భోళాశంకరుడైన శివుని గురించీ, ఆయన నివాసస్థానమైన కాశీ గురించీ ఆడి, పాడి, అందరినీ అలరిస్తూన్న ఒకానొక గుంపు నాయకుడు, తన తోటివారిని ఉత్తేజపరుస్తూ అంటున్నాడు, ఎలా? బ్రహ్మాండమైన ఆశుకవిత్వంతో ఇలా.

శంఖం భం భం భోలే (భోళాశంకరుడా) అని మ్రోగుతూంటే, ఢం ఢం అని డోలు కూడా చెలరేగి పోతోంది. ఇంకేం, మనంకూడా తత్-ధినక్-ధిన్ అని దరువేసి సందడి చేసేద్దాం. పగలా, రాత్రా, అని చూసుకోకుండా ఆనందంతో పరుగెడుతూ ముందుకు సాగుదాం. ఎందుకూ? ఎందుకా? అదిగో చూడండి.

శివుడు ఆనందంతో తల ఊగిస్తే, ఆయన సహస్రారం నుండి జారిన ఆనందామృతం ఒక చిన్న లహరై విలాసంగా భూమ్మీదకి జారి (జటాటవీ గల-జ్జలప్రవాహ పావితస్థలే... అంటాడు రావణాసురుడు శివతాండవస్తోత్రంలో), గంగా నదిగా మారి, ఒక మహాజలప్రవాహంగా, విశాలాక్షి అమ్మవారి సమేతంగా అందరికీ వరాలిచ్చే కాశీపురం చేరింది. అందుకు.

వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా

నా ఈ ముచ్చటైన పాట వారణాసిని (ఉత్తరాది వాళ్ళు వారాణసి అంటే, మన తెలుగువాళ్ళం వారణాసి అంటాం. ఏదైన కాశీయే) వర్ణించిన అలనాటి శ్రీనాథుని అద్భుత కావ్యం కాశీఖండాన్ని గుర్తు చేయుగాక.

ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందీ నా ఈ చిరుఘంటికా

ఇంకా ఏమంటోందీ, నా ఈ చిన్న ఘంటిక (కలం. పెన్ను) ? "అదిగో చూసేరా? అదే మణికర్ణికాఘట్టం" అంటోంది. ఏంటి ఆ మణికర్ణిక ప్రత్యేకత అంటారా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ గట్టుమీద కాని దహనం చేయబడితే మరో జన్మ ఎత్తే అవసరమే లేదుట. తిన్నగా మోక్షమే మరి.

నమకచమకాలై ఎదలయలే కీర్తన చేయగా, యమకగమకాలై పదగతులే నర్తన చేయగా.. ప్రతీ అడుగూ, తరిస్తోంది, ప్రదక్షిణగా

లయగా కొట్టుకునే మన గుండె చప్పుళ్ళే నమకమూ చమకమూ (స్తోత్ర, ప్రార్ధనలు) అయి ఆ రుద్రుణ్ణి కీర్తిస్తుండగా, వాటికి మన ఈ పదగతులు యమకగమకాలుగా (ప్రక్కవాయిద్యాలు అనుకోండి) తోడై నర్తన చేస్తూండగా, మనం ప్రదక్షిణగా వేస్తూన్న ప్రతీ అడుగూ తరిస్తోంది మరి.

..........................................................

ఎదురయే శిలఏదైనా శివలింగమే, మన్నుకాదు మహాదేవుని వరదానమే

కాశీలో "కంకర్ కంకర్ మేఁ శంకర్ హైఁ" అని ఒక నానుడి ఉంది. అంటే, "కాశీలో కనిపించే ప్రతీ చిన్న రాయిలో కూడా శంకరుడుంటాడు" అని. అదే అంటున్నాడు కవి ఇక్కడ. ఎదురయే ఏ రాయైనా శివలింగమే. అలాగే, ఇక్కడి మట్టి కూడా ఆ శివుడి వరదానమే. ఎలాగంటారా! మరి ఆయన ఆనందంగా తలాడించబట్టే కదా, గంగ మహానదిగా ప్రవహించింది? మరి ఆ నది ప్రవహించబట్టే కదా ఒండ్రుమట్టి వచ్చి చేరింది? మరి ఆ మన్నే కదా మనమిక్కడ చూసేది. అలాగ.

చిరంజీవిగా నిలచింది ఈ నగరమే, చరితలకు అందనిది ఈ కైలాసమే

కాశీ చరిత్ర తెలిసిన వారెవరైనా ఇది అనాదిగా ఉన్న నగరమనీ, ఎవరు ఎన్నో రకాలుగా ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, మళ్ళీ పూర్వ వైభవంతో లేచి నిలబడుతోందనీ ఒప్పుకుంటారు. ఏడవ శతాబ్దపు చైనా యాత్రీకుడు హుయన్‌త్సాంగ్ ఈ ఊరిని ఒక మహానగరంగా వర్ణించేడు. భారతదేశం మీద పడ్డ ప్రతీ తురకతండా ఈ నగరాన్ని, విశ్వనాథుడి ఆలయాన్నీ ఏదో ఒక రకంగా ధ్వంసం చేసినవాళ్ళే. అయితే ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు కూలగొట్టినా మళ్ళీ తిరగకడుతున్నారనే అక్కసుతో దాన్ని పూర్తిగా నాశనం చెయ్యడమేగాక మళ్ళీ పునరుద్ధరించడానికి వీలులేదని ఆంక్ష పెట్టేడు సికందర్ లోఢి అనే ఒక తురక 1494లో. అయినా పూర్వవైభవం సంతరించుకుని మళ్ళీ నిలబడిందీ గుడి 1569లో. ఒక వందేళ్ళ తర్వాత ఔరంగజేబని మరో తురకొచ్చేడు. వాడేం చేసేడూ? దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసి దాని స్థానంలో ఒక మసీదు కట్టించేసేడు. కానీ క్షేత్రమహిమనెవరు తగ్గించగలరు? ఏభైయేళ్ళు తిరక్కుండానే, ఆ మసీదు పక్కనే మళ్ళీ విశ్వనాథుడి గుడి కట్టించింది రాణి అహల్యాబాయ్. మరి ఇలాంటి ఊరినీ, అక్కడ ఉన్న ఆలయాన్నీ చిరంజీవి అని అనకుండా ఎలా ఉండగలం?

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే, తరలి రండి, తెలుసుకోండి కాశిమహిమ

గంగానది గట్టుమీద నడుస్తూంటే, ఆగకుండా వినిపిస్తూంటుంది ఓంకారనాదం. ప్రశాంతమైన గంగాప్రవాహం మరి ఆ శివుడి కారుణ్యమే కదా. మరింకేం? బయల్దేరండి కాశీకి. వెళ్ళి తెలుసుకోండి ఆ క్షేత్రమహత్మ్యాన్ని.

ఒక పుణ్యతీర్థం గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పగలరండీ, ఒక్క సీతారామశాస్త్రిగారు తప్ప? అసలు ఈ పాట గురించి యోగి ఆదిత్యనాథ్ కో , లేక నరేంద్రమోదీకో తెలిస్తే, వాళ్ళు వెంటనే శాస్త్రిగారిని కాశీకి బ్రాండ్ ఎంబాసడర్ గా పెట్టేసుకుంటారు. శాస్త్రిగారికి శిరసా అభివందనాలు. 

No comments:

Post a Comment