Pages

Sunday, December 3, 2017

కొఱవి గోపరాజు గారి చమత్కార కవిత్వం

కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారు. ఈయన కాలం క్రీ.శ. 1430 - 1530 ల మధ్య. ఈయన సులువుగా అర్థం చేసుకునేలా  ఉండే మామూలు తెలుగుమాటలతో, మంచి చమత్కారంగానూ, సమయస్ఫూర్తి తోనూ పద్యాలు చెప్పేవారు.సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.

ముందు చెప్పినట్టు ఈయన పద్యాలు కొన్ని చమత్కారంగా ఉంటే మరికొన్ని ఆలోచింప జేసేవిగా ఉంటాయి.

చమత్కారానికి ఉదాహరణ పద్యం:

 ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి యొకని వెంట వచ్చి యొకని గలిసి
 వెడలి పారితనుచు విందు మట్లయ్యునీ జీవనంబు లోకపావనంబు.

ఔదల (ఔ + తల ) -- నడినెత్తి

గంగ విష్ణువు పాదాల దగ్గర పుట్టి, శివుడి నెత్తినెక్కి, భగీరధుడి వెనక వెళ్ళి, చివరగా సముద్రుడిలో కలిసిపోతుంది. అయినా ఆవిడ లోకపావనే కదా.

గోపరాజుగారు చెప్పిన తెలివైన పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుందిట. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,

రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.

పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.

అదీ సంగతి.

(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)





Sunday, November 19, 2017

మంచి మంగళశ్లోకం

శ్రీవాణిగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంథరా శ్శ్రేయశే ||

పై శ్లోకం నన్నయగారు తెలుగించిన ఆంధ్రభారతం, ఆదిపర్వంలో మొదటిది. ఇది ఒక మంగళశ్లోకం. మొత్తం సంస్కృతమే. భారతం తెలుగులో వ్రాస్తానని మొదలు పెట్టడమే సంస్కృతంలో అవడం కొంత ఆలోచించవలసిన విషయమే. సంస్కృతం దేవతల భాష అనో, లేక "తల్లి సంస్కృతంబు సర్వ భాషలకును" అనో, ఆ భాష మీద గౌరవంతో అలా వ్రాసుంటారు. లేదా, ఇప్పుడెలా ప్రతి రెండు ఇంగ్లీష్ మాటలకీ ఒక తెలుగు ప్రత్యయం చెప్పి, తర్వాత OK అనేసి ముగించి అదే తెలుగని ఎలా అనుకుంటున్నామో, అప్పట్లో చదువుకున్నవారు సంస్కృతం ఎక్కువవాడి తెలుగు తక్కువ వాడే వారేమో.

ఏది ఏమైనా, ఏ భాషలో వ్రాసినా, ఒక బ్రహ్మాండమైన పద్యమని చెప్పితీరాలి.

పై పద్యానికి అర్థమేంటంటే, ఎవరైతే లక్ష్మి-సరస్వతి-పార్వతులను ఎప్పటినుంచో  గుండెలమీదా, నాలుకమీదా, సగం ఒంటిమీదా పెట్టుకుని, మర్త్యలోకాలకి స్థిరత్వాన్ని ఆపకుండా కలుగజేస్తున్నారో, ఆ వేదత్రయ మూర్తులైన వారు, దేవతలచేత పూజింపబడేవారూ అయిన త్రిమూర్తులు
           పురుషోత్తముడు -- విష్ణువు,
           అంబుజభవుడు   -- అంబుజమంటే, నీటిలోంచి పుట్టినదైన తామరపువ్వు. అలాంటి
                             పద్మంలోంచి పుట్టేడు కాబట్టి బ్రహ్మ అంబుజభవుడు అయ్యేడు
           శ్రీకంథరుడు  -- ఇక్కడ శ్రీ అంటే విషమని అర్థం చేసుకోవాలి. విషాన్ని గొంతులో
                             పెట్టుకున్నవాడు కాబట్టి శివుడు శ్రీకంథరుడయ్యేడు
మీకు మేలు కలుగించేవారు అగుగాక అని.

ఈ శ్లోకంలో వేదత్రయమనే పదం కొంచం ఆలోచింపచేసేది. వేదత్రయమూర్తులంటే, మూర్తీభవించిన ఋగ్యజుస్సామవేదాలనే మూడు వేదాలుగా అర్థం చేసుకోవచ్చు.

అంటే వేదత్రయమంటే మూడు వేదాలనేనా. అంటే మరి నాలుగోదైన అథర్వణ వేదమో ? అది ఇంతకు ముందు లేదా ? తర్వాత ఎవరో పుట్టించారా ? చాలామంది తెల్ల దొరలైన పండితులు అలాగే చెప్పేరు మరి.

అసలు విషయం అదికాదు. వేదమంత్రాలను ఒక పద్ధతిలో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు - శ్లోకం, గానం, గద్యం అని. శ్లోకరూపంలో ఉన్నవాటిని ఋక్కులనీ, గానరూపంలో ఉండే మంత్రాలని సామాలనీ, గద్యరూపంలో ఉండేవాటిని యజుస్సులనీ, కలిపి ఋగ్గ్యజుస్సామాలని అంటారు. ఈ శ్లోకం, గానం, గద్యం అనేవి నాలుగు వేదలలోనూ ఉంటాయి. కాబట్టి, వేదాలు అథర్వణ వేదంతో కలిపి నాలుగని తెలుసుకోవడం మంచిది. ఇదే విషయన్ని పండితులూ, ప్రవచన కర్తా అయిన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎన్నో వేదికలమీద మరీమరీ చెప్పేరు.

అదీ సంగతి మరి.