Pages

Monday, January 15, 2018

వెఱ్ఱిగొల్లడు అంటే తప్పేంటి?

ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి అవతారాలైన రామకృష్ణులిద్దరినీ, వాళ్ళు పుట్టిపెరిగిన వాతావరణ పరిస్థితుల బట్టి పోలుస్తూ కృష్ణుడ్ని "వెఱ్ఱి గొల్లడు, తలకడిగితే మొలకడగడం తెలియని వాడు" అన్నారు. అంతే. ఆ మాటమీద తెలుగుదేశంలో పెద్దపెద్ద గొడవలయిపోయేయి. రాస్తారోకోలు, చాగంటిగారి బొమ్మని అందరూ చూస్తూండగా అవమానించడాలూ, ఆయన్ని నానా మాటలూ అనడాలూ, టీవీలో చర్చలూ, వాదోపవాదాలూ, ఒకటేంటి. ఎంత హడావిడి జరగొచ్చో అంతా జరిగింది. ఎవరితోనూ గొడవకి దిగడం ఇష్టంలేని మంచాయన చాగంటిగారు, ఈ విషయం వెంటనే సద్దుమణిగి పోవాలనే మంచి ఉద్దేశ్యంతో గొల్లకులం వారందరికీ క్షమాపణ చెప్పుకున్నారు.

ఇంతకీ గొల్ల అనే మాట మంచిదో కాదో చూద్దాం. గోపాలః అనేది సంస్కృత పదం. దీని అర్థం గోవులను పాలించేవాడు లేదా పశుపాలనే వృత్తిగా బ్రతికేవాడు అని. ఇది తెలుగులోకి వచ్చేసరికి గోపాలుడు అయ్యింది. దీనికి బహువచనం గోపాలురు అవుతుంది. అయితే, ఏ భాషలోనైనా ప్రకృతి, వికృతి అని ఉంటాయి. గ్రాంథికపదాలు ఆ భాష నుడికారానికి అనుగుణంగా వాడుకలోకి వచ్చినప్పుడు కొంతమారడం సహజం. శిష్టపదాల్ని ప్రకృతులనీ, వాడుకపదాల్ని వికృతులనీ అంటాం.
ఉదా: బ్రాహ్మణుడు -- బాపడు, శ్రేష్ఠి -- శెట్టి, నాయకుడు  -- నాయుడు. అలాగే గోపాలుడు గొల్లడు గానూ, గొల్ల గానూ వికృతి చెందిన పదం. ఈ పదాలు తెలుగులో ఎప్పట్నుంచో వాడుకలో ఉన్నవి. అన్నమాచార్యులుగారు ఆయన వ్రాసిన కీర్తనలలో చాలాచోట్ల గొల్ల, గొల్లడు, గొల్లెత అనే పదాలు వాడేరు. శ్రీకృష్ణుడిని తమ కులస్థుడిగా భావించేవాళ్ళు వాళ్ళని వాళ్ళే "మేము గొల్లలం" అని చెప్పుకుంటారు. గొల్లపేరుతో మొదలయ్యే ఊళ్ళూ గుళ్ళూ చాలా కనపడతాయి. విశాఖపట్నంలో "గొల్ల కంచరపాలెం" అనే ప్రాంతముంది. కాకినాడ పొలిమేర దగ్గిర "గొల్లల మామిడాడ" అనే ప్రఖ్యాత సూర్యక్షేత్రముంది. ఇంక తిరుమలలో గొల్లవారికున్న ప్రాముఖ్యత, విలువ అందరికీ తెలిసిందే. మరి  ఇంత చరిత్ర, అస్తిత్వం, పేరుప్రఖ్యాతులూ ఉన్న వర్గం వారు తమని తాము వేరే విధంగా పిలుచుకోవాలని ఎందుకనుకుంటున్నారో, వాళ్ళకే తెలియాలి.

ఇప్పుడు వెఱ్ఱిగొల్లడు అనే పదం సరైన మాటో కాదో చూద్దాం. వెఱ్ఱి అనే పదానికి మతిలేనివాడు అనే కాకుండా అమాయకుడూ, కల్మషంలేనివాడూ అనే అర్థం కూడా ఉంది. ఒకప్పుడు మనదేశంలో ఎవరిమటుకు వారు వాళ్ళవాళ్ళ కులవృత్తులు మాత్రమే చేసుకుని బ్రతికేవాళ్ళు. ఒకమనిషి గొడ్లు కాచుకోవడం, వాటిపాడిమీద ఆధారపడి బ్రతికేవారి కులంలో పుడితే తనూ చిన్నప్పట్నుంచీ గొడ్లకి సంబంధించిన పనులే చేస్తూ పెరిగేవాడు. అతనికి వేరే చదువు, విద్యలతో పనీ, పరిచయం ఉండేవికాదు. ఆ రోజుల్లో ఈ గోపాలన అనేది అతిమామూలు వృత్తి కాబట్టీ, పెద్దగా ఆలోచన ఉపయోగించి చేయాల్సిన పనికాదు కాబట్టీ, అటువంటి గొల్లవానికి లోకజ్ఞానం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇలాగ పెద్దగా ప్రాపంచిక విషయాలు తెలియకుండా కల్లాకపటంలేని జీవనం గడిపేవాడిని "వెఱ్ఱిగొల్లడు" అనడం వాడుకలో ఉండేది. ఇదేదో అతన్ని కించపరచడానికో, అవమానించడానికో అనేమాటకాదు. ఆ మాటకొస్తే, వెఱ్ఱిగొల్లడే కాదు, వెఱ్ఱిబాపడనే మాటకూడా ఉంది.  రోజూ గుళ్ళో దేవుడ్ని సేవించుకుంటూ, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన దక్షిణతోనూ, గుళ్ళో ప్రసాదంతోనూ బ్రతికే నిష్కల్మషమైన బ్రాహ్మణుడ్ని అలా అనేవారు.

ఇంక తలకడిగితే మొలకడగడం తెలియని వాడు అన్న విషయం. భాష తెలియకపోతే వచ్చే చిక్కులివి. ఇక్కడ ఏదో కడుక్కోడం గురించి ప్రస్తావించట్లేదాయన. తలకి అడిగితే మొలకి అడగడు అని అర్థం వచ్చేమాట కాస్తా అనర్థం అయికూర్చుంది తెలుగుభాషా మూఢులకి. కథ ఏంటంటే,  అమాయకుడూ, లోకజ్ఞానంలేనివాడూ అయిన ఒకానొక పేదవాడు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాట్ట. ఒంటిమీద కట్టుకోడానికి కూడా లేని ఈ పేదభక్తుడు స్వామిని ఒక తలపాగా ఇప్పించమన్నాట్ట. అప్పుడీశ్వరుడు నవ్వి, "తలకిస్తానుగానీ మొలకేం కడతావ్ మరి!" అన్నాడు. అప్పుడీ అమాయకుడు "సరే అయితే, మొలకి కట్టుకోవడానికొక గుడ్డ ఇవ్వండి స్వామీ, తలకొద్దులెండి" అన్నాట్ట. తలకీ, మొలకీ రెంటికీ ఇమ్మని కూడా దేవుణ్ణడగలేనంత అమాయకుడు మరి.

ఇదంతా చూస్తే ఉత్తిపుణ్యానికి ఒక మంచిమనిషిమీద బురద చల్లడానికి తప్పితే ఈ గొడవకి అర్థం లేదనిపిస్తుంది. అదీ సంగతి.

Saturday, January 13, 2018

శంకరా నాదశరీరా పరా

శంకరా నాదశరీరా పరా

శంకరాభరణం సినిమా గురించి తెలియనివాళ్ళూ, కనీసం అందులోని పాటలు విననివాళ్ళూ తెలుగువాళ్ళలో ఉండరేమో. సుమారు 38 సంవత్సరాల క్రితం, 1980 ఫిబ్రవరి 12వ తేదీ న విడుదలై, అప్పట్లో వచ్చే సినిమాకథలకి పూర్తి విరుద్ధంగా, సాంప్రదాయ సంగీతసాహిత్యాలకి సంబంధించిన కథతో వచ్చి, దేశాన్ని ఒక్క ఊపు ఊపి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి అస్తిత్వాన్నీ, దర్శకుడు విశ్వనాథ్ కి అమరత్వాన్నీ, కవి వేటూరి పాటలకీ, మహదేవన్ సంగీతానికీ అజరామరత్వాన్నీ సంపాదించిపెట్టిన, ఎప్పటికీ జ్ఞాపకముండిపోయే మంచి తెలుగు సినిమా శంకరాభరణం.

సాధారణంగా తెలుగులో ఎప్పుడూ వినే, పాడుకునే పాతపాటలన్నీ (క్లాసిక్స్) ఘంటసాల యుగంలో వచ్చినవే. కానీ శంకరాభరణం పాటల విషయంలో మాత్రం ఈ వాదన చెల్లదు. సంగీత సాహిత్యాలు రెండింట్లోనూ అవి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్పవి. అయితే, ఆ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళకన్నా, వాటిని విని ఆ సంగీతాన్ని మెచ్చుకొనేవాళ్ళే ఎక్కువ. కానీ ఒక్కసారి ఆ సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే, ఆహా! అనకుండా ఉండలేం. ఉదాహరణకి శంకరా నాదశరీరా పరా అనే పాట వెనుక సాహిత్యాన్ని పరిశీలనగా చూద్దాం.

శంకరశాస్త్రిగారు ఒక నిశిరాత్రివేళ శివుడికి నివేదనగా వినిపిస్తున్న పాట ఇది.చూడండి ఏమని పిలుస్తునాడో శివుణ్ణి.

"శంకరా, నాదశరీరా, పరా, వేదవిహారా, హరా. జీవేశ్వరా..."

శుభం కలిగించేవాడా, ఓంకార స్వరూపా, వేదాలలో విహరించేవాడా, అజ్ఞానాన్ని హరించేవాడా, జీవులందరికీ ఈశ్వరుడా...

ఎందుకు పిలుస్తునాడు? తను పాడే పాట వినడానికి. అయితే మరీ చప్పగా, "పాట పాడతాను, విందువుగాని రా" అంటే ఆయన శంకరశాస్త్రి గారు ఎందుకవుతారు? ఎంతో కొంత ఉపోద్ఘాతమివ్వాలి. అది కూడా కవితాత్మకమైయ్యుండాలి. ఇదిగో ఇలాగన్నమాట.

"ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమని,
మౌన విచక్షణ, గానవిలక్షణ, రాగమే యోగమని,
నాదోపాసన చేసినవాడను, నీ వాడను నేనైతే"

ఓంకారాత్మకమైన శివుడే నా శ్వాసలో ఉన్న ప్రాణశక్తి అని, ఆ ఓంకారంలోంచి పుట్టినదే నేను చేసే గానమని, శబ్దబ్రహ్మమైన రాగాలాపనే యోగమని భావించి నాదోపాసన (సంగీతాన్నే దైవంగా భావించి సాధన చేయడం) చేసే నేను నిజంగా నీ భక్తుడనైతే,

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంథరా

అష్టదిగ్గజాలకధిపతివీ (దిక్ + కరి + ఇంద్ర + జిత = దిక్కరీంద్రజిత. అష్టదిక్కులు మోస్తూన్న ఎనిమిది ఏనుగులకి అధిపతులైన అష్టదిక్పాలకుల పైనున్నవాడివి), కైలాసాధిపతివీ (హిమగిరి = కైలాసం), తెల్లనివాడివీ లేదా స్వచ్ఛమైనవాడివీ (సిత), కపాలధారీవీ(కం-ధరా), నీలకంఠుడివీ (నీలకంథరా) .... (అయిన ఓ శివుడా)

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా విని తరించరా

అజ్ఞానులకు అర్థంగానిదైన అర్ధరాత్రి నేను చేసే ఈ రుద్రవీణా గానం (అనుమానం: బహుశా అసలు కథ ప్రకారం రుద్రవీణ వాయిస్తూ పాడాలేమో శాస్త్రిగారు. దానికనుగుణంగా పాట వ్రాయడమూ, రికార్డింగ్ చేసెయ్యడమూ అయిపోయుంటుంది. తీరా షాట్ తీసేటప్పుడు చూస్తే రుద్రవీణ అందుబాటులో ఉండుండదు. తుంబురతో సరిబెట్టేసుంటారు. అనుకుంటా...) ఇదిగో నీకే (అవధరించు), బాగా విని ఆనందించవయ్యా

అని పాడుతూంటే, ఇంతలో ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అదిచూసి, ఆ శివుడు తన పాట విన్నాడనీ, దాని ఫలితమే ఈ కుండపోత అనీ అనుకుని మహదానందంతో మళ్ళీ ఇలా అందుకున్నాడు మన శంకరశాస్త్రిగారు.

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నగవులు కాబోలు,
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా
నా గాన లహరి నువు మునుగంగా ఆనందవృష్టి నే తడవంగా

శివా! నా కవిత్వానికి నువ్వు ముసిముసిగా చిరునవ్వులు నవ్వితే ఒక్కసారి కనిపించి మాయమైన నీ పంటికాంతులేనేమో ఈ మెరుపులు?
నా పాటకి నువ్వు నాట్యం చేయ్యడం మొదలెడితే, నీ కాలి అందెల మువ్వలు శబ్దమనుకుంటా, ఈ ఉరుములు.
నా గానమాధుర్యానికి నువ్వు పరవశించి ఒక్కసారి తలవిదిలించినట్టున్నావు, అంతే. నీ తలమీదున్న గంగ నేలకి జారి వర్షమై పడుతోంది.
నా పాటవెల్లువలో నువ్వు మునిగిపోయి, ఆ ఆనందంలో కురిపించిన ఈ వానలో నేను తడిసిపోయి, భలే!

ఇంతగొప్ప కవిత్వాన్ని మనకందించి వెళ్ళిన వేటూరి గారికి నమస్తే!