Pages

Sunday, December 3, 2017

కొఱవి గోపరాజు గారి చమత్కార కవిత్వం

కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారు. ఈయన కాలం క్రీ.శ. 1430 - 1530 ల మధ్య. ఈయన సులువుగా అర్థం చేసుకునేలా  ఉండే మామూలు తెలుగుమాటలతో, మంచి చమత్కారంగానూ, సమయస్ఫూర్తి తోనూ పద్యాలు చెప్పేవారు.సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.

ముందు చెప్పినట్టు ఈయన పద్యాలు కొన్ని చమత్కారంగా ఉంటే మరికొన్ని ఆలోచింప జేసేవిగా ఉంటాయి.

చమత్కారానికి ఉదాహరణ పద్యం:

 ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి యొకని వెంట వచ్చి యొకని గలిసి
 వెడలి పారితనుచు విందు మట్లయ్యునీ జీవనంబు లోకపావనంబు.

ఔదల (ఔ + తల ) -- నడినెత్తి

గంగ విష్ణువు పాదాల దగ్గర పుట్టి, శివుడి నెత్తినెక్కి, భగీరధుడి వెనక వెళ్ళి, చివరగా సముద్రుడిలో కలిసిపోతుంది. అయినా ఆవిడ లోకపావనే కదా.

గోపరాజుగారు చెప్పిన తెలివైన పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుందిట. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,

రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.

పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.

అదీ సంగతి.

(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)