Pages

Wednesday, December 5, 2018

అలమలం అలమలం - alamalam alamalam

ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ సీను మళ్లీ చూస్తే ఈ పదం ఈ సందర్భానికి ఎంతబాగా కుదిరిందో తెలుస్తుంది. ఇదే పదం శ్రీరుద్రనమకం, 8వ అనువాకంలో కూడా వినపడుతుంది.ఇలాంటి అందమైన వైదికపదాలని సినిమా ద్వారా నవ్వు తెప్పించేటట్లుగా వాడుతూ పరిచయం చేయడంలో పెండ్యాలగారు సిద్ధహస్తులు. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి నోట అంగన్యాసంలో చెప్పుకునే "అస్త్రాయఫట్" అని చెప్పించిన ఘనత కూడా ఈయనదే.

యథారాజా తథా ప్రజాః

మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।
లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।
రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు సమంగా చేస్తే ప్రజలూ ఆ రాజునే అనుసరిస్తారు. మొత్తానికి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగుంటారు.

లోకపావని

కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారుండేవారట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన పద్యాలు మంచి సరదాగానూ, తెలివిగానూ చెప్పేవారు. సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.
ముందు చెప్పినట్టు ఈయన పద్యాలు కొన్ని చమత్కారంగా ఉంటే మరికొన్ని ఆలోచింప జేసేవిగా ఉంటాయి.
చమత్కారానికి ఉదాహరణ పద్యం:
ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి
యొకని వెంట వచ్చి యొకని గలిసి
వెడలి పారితనుచు విందు మట్లయ్యునీ
జీవనంబు లోకపావనంబు.
ఔదల (ఔ + తల ) -- నడినెత్తి
గంగ విష్ణువు పాదాల దగ్గర పుట్టి, శివుడి నెత్తినెక్కి, భగీరధుడి వెనక వెళ్ళి, చివరగా సముద్రుడిలో కలిసిపోతుంది. అయినా ఆవిడ లోకపావనే కదా.
అదీ సంగతి.
(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)

రాజ, దీని వివాహము చేయవయ్యా!

ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,
రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.
పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.
పై పద్యం పదిహేనవ శతాబ్దపు కవి కొఱవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశిక లోనిది.
(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)

శ్రీదేవికి శ్రద్ధాంజలి

మానాన్న నిర్దోషని బల్లగుద్ది ఋజువుచేసి,
బూచాడమ్మా బూచాడని బడిపంతుల్నే మురిపించి,
పదహారేళ్ళ వయసులో సిరిమల్లె పువ్వుగా
విరిసి, పంటచేనులో పాలకంకిలా నవ్వి,
వేటగాడితో ఆకుచాటుపిందెగా దోబూచులాడి,
జాబిలితో చెప్తానని బెదిరించి, పరుగెత్తించి,
బుర్రిపాలెం బుల్లోడిని ఘరానాదొంగ చేసి,
కార్తీకదీపపు వెలుతుర్లో గోరింక పిలిస్తే
ముద్దుల చిలకమ్మగా ఓయని పలికి,
హిమ్మతువాలాని వెతుక్కుంటూ ఉత్తరాదికి వెళ్ళి,
విజయవై బొంబాయిలో బావుటా ఎగురవేసి,
మళ్ళీ ఆఖరిపోరాటం చేస్తూన్నవాడితోనే అబ్బ! దీని సోకు! అనిపించుకుని,
జగదేకవీరుడెవరైనా అతిలోకసుందరిని మాత్రం నేనేనంటూ,
క్షణక్షణమూ దేవుడాదేవుడా అని ఆదేవుడ్నే నవ్వించి,
గోపాలవర్మతో గోవిందగోవిందని గోవిందకొట్టించి
పదికాలాలకు సరిపడేంత ప్రేమాభిషేకం చేసివెళ్ళిన
దేవీ, శ్రీదేవీ, మౌనమా! ఇక మౌనమేనా ! 😥

కేరాఫ్ కంచరపాలెం - సమీక్ష

C/o Kancharapalem చూసేరా? బాగుంది కదూ! ఇంకా చూడలేదా! ఐతే వెంటనే వెళ్ళి చూసెయ్యండి. మిగతా తెలుగు సినిమాలలాగా గందరగోళమైన పాటలూ, తొంభై శాతం బట్లరింగ్లీషూ, మిగతా పదిశాతం మహమూద్ హిందీతో కలిసిన తెలుగుతో నాటకఫక్కీలో చెప్పే మాటలూ, ఇవేమీ లేకుండా, మామూలు మనుషులతో మన చుట్టుపక్కల జరిగే విషయాలతో కథనల్లి దాన్ని సినిమాగా చూపించేరు. ఇందులో అనవసరమైన అలౌకిక దెబ్బలాటల్లేవు. చెత్త ఇంగ్లీషుతో కలుషితమైన తెలుగు మాటలేదు. హిందీమాటలుంటాయి కానీ, అవి పాత్రోచితమైనవి. బూతుమాటలుంటాయి కానీ, అవికూడా సందర్భోచితమైనవే. వాటిని బూతులని కూడా అనలేం. అశ్లీలత లేనీ మాండలీకం అంతే. ఇంగ్లీషు, హిందీ, లేదా ఏ ఇతర పైశాచికభాషా కలిసిన పాటల్లేవు. శృతిలేని వీధి పాటలైనా వినడానికి హాయిగా ఉంటాయి. "సొట్టబుగ్గల ఓ చిన్నదీ...", "కలకత్తా కాళి, పరమగయ్యాళి, కాబోయే నా ఆలి..." అనేవి రెండు మచ్చుతునకలు. నలభై ఏళ్ళ సగటుమనిషి ప్రేమ కథా సరిత్సాగరాన్ని రెండున్నర గంటలసేపు రంగులరాట్నంలా తిప్పి చూపించి, ఆహా! ఎంత బాగుందిరా! అని హాలుని వదిలి వెళ్ళేలా చేసేరు. మంచి తెలుగు సినిమా చూడాలనుకునే వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ప్రత్యేకించి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే గుండెలకి హత్తుకుపోతుంది. దీన్నే ఇంగ్లీషువాడు నోస్టాల్జియా అంటాడేమో. అందరూ కొత్తవాళ్ళతో తీయడమే ఈ సినిమాకి బలాన్నిచ్చింది. ఎవరికీ నటించడం రాదూ, నటించలేదు కూడా. ఎవరిపాత్రలో వాళ్ళు దూరిపోయి, రోజూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా నడుచుకుంటారో అలాగే నడిచి, ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడి జీవించేసేరంతే.
కథంతా కంచరపాలెమూ (విశాఖపట్నంలో ఒక ప్రాంతం), చుట్టుపక్కల రెండుమూడు ప్రాంతాలలోనే నడుస్తుంది. గవర కంచర పాలెం, అందులోనే రెండు వీధులకి విస్తరించిన రామ్మూర్తి పంతులుపేట (ఆర్.పి.పేట), జ్ఞానాపురం, మాధవధార, సింహాచం గుడి. అంతే. సంత, దానికానుకునే ఉన్న దుంపల బడి, అందులో పిల్లల ఝండా వందనం, వినాయక చవితి వేడుకల తయారీ, రైల్వేగేటూ, ఇవన్నీ చూపించి, ఆ ప్రాంతంలోనే చిన్నతనం గడిచిన నా లాంటి వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్ళి పోతాడు దర్శకుడు. ఇలాంటి కథ రాసుకుని అస్సలనుభవంలేని నటీనటులతో ఎంతో బాగా తీసిన ఈ సినిమా దర్శకుడికీ, అతని శక్తిసామర్ధ్యాల మీద నమ్మకముంచి ధైర్యంగా పెట్టుబడి పెట్టిన నిర్మాతకీ, విడుదల చేసిన పంపిణీదారులకీ హృదయపూర్వక అభినందనలు.

శాస్త్రిగారి కాశీ

తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చెప్తూ, ఆయన్ని హైదరాబాద్ లో చార్మినార్ ప్రక్కనున్న ఇఱుకు సందుల్లో కోటి రూపాయల విలువైన పెద్ద పోర్షా కారుని వేగంగా నడపగలిగే నేర్పుగల డ్రైవరుతో పోల్చేరు. ఇది ఎంత సరైన పోలికో, సీతారామశాస్త్రిగారు ఇంద్ర సినిమాకి భం భం భోలే అని కాశీ నగరం మీద వ్రాసిన పాటని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది.

భం భం భోలే శంఖం మ్రోగెలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే,
తద్ధినకధిన్ దరువెయ్, సందడి రేగనీ, పొద్దులెరుగని పరుగై, ముందుకు సాగనీ
విలాసంగా శివానంద లహరి, మహాగంగాప్రవాహంగా మారి, విశాలక్షి సమేతంగా చేరి, వరాలిచ్చే కాశీపురి

భోళాశంకరుడైన శివుని గురించీ, ఆయన నివాసస్థానమైన కాశీ గురించీ ఆడి, పాడి, అందరినీ అలరిస్తూన్న ఒకానొక గుంపు నాయకుడు, తన తోటివారిని ఉత్తేజపరుస్తూ అంటున్నాడు, ఎలా? బ్రహ్మాండమైన ఆశుకవిత్వంతో ఇలా.

శంఖం భం భం భోలే (భోళాశంకరుడా) అని మ్రోగుతూంటే, ఢం ఢం అని డోలు కూడా చెలరేగి పోతోంది. ఇంకేం, మనంకూడా తత్-ధినక్-ధిన్ అని దరువేసి సందడి చేసేద్దాం. పగలా, రాత్రా, అని చూసుకోకుండా ఆనందంతో పరుగెడుతూ ముందుకు సాగుదాం. ఎందుకూ? ఎందుకా? అదిగో చూడండి.

శివుడు ఆనందంతో తల ఊగిస్తే, ఆయన సహస్రారం నుండి జారిన ఆనందామృతం ఒక చిన్న లహరై విలాసంగా భూమ్మీదకి జారి (జటాటవీ గల-జ్జలప్రవాహ పావితస్థలే... అంటాడు రావణాసురుడు శివతాండవస్తోత్రంలో), గంగా నదిగా మారి, ఒక మహాజలప్రవాహంగా, విశాలాక్షి అమ్మవారి సమేతంగా అందరికీ వరాలిచ్చే కాశీపురం చేరింది. అందుకు.

వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా

నా ఈ ముచ్చటైన పాట వారణాసిని (ఉత్తరాది వాళ్ళు వారాణసి అంటే, మన తెలుగువాళ్ళం వారణాసి అంటాం. ఏదైన కాశీయే) వర్ణించిన అలనాటి శ్రీనాథుని అద్భుత కావ్యం కాశీఖండాన్ని గుర్తు చేయుగాక.

ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందీ నా ఈ చిరుఘంటికా

ఇంకా ఏమంటోందీ, నా ఈ చిన్న ఘంటిక (కలం. పెన్ను) ? "అదిగో చూసేరా? అదే మణికర్ణికాఘట్టం" అంటోంది. ఏంటి ఆ మణికర్ణిక ప్రత్యేకత అంటారా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ గట్టుమీద కాని దహనం చేయబడితే మరో జన్మ ఎత్తే అవసరమే లేదుట. తిన్నగా మోక్షమే మరి.

నమకచమకాలై ఎదలయలే కీర్తన చేయగా, యమకగమకాలై పదగతులే నర్తన చేయగా.. ప్రతీ అడుగూ, తరిస్తోంది, ప్రదక్షిణగా

లయగా కొట్టుకునే మన గుండె చప్పుళ్ళే నమకమూ చమకమూ (స్తోత్ర, ప్రార్ధనలు) అయి ఆ రుద్రుణ్ణి కీర్తిస్తుండగా, వాటికి మన ఈ పదగతులు యమకగమకాలుగా (ప్రక్కవాయిద్యాలు అనుకోండి) తోడై నర్తన చేస్తూండగా, మనం ప్రదక్షిణగా వేస్తూన్న ప్రతీ అడుగూ తరిస్తోంది మరి.

..........................................................

ఎదురయే శిలఏదైనా శివలింగమే, మన్నుకాదు మహాదేవుని వరదానమే

కాశీలో "కంకర్ కంకర్ మేఁ శంకర్ హైఁ" అని ఒక నానుడి ఉంది. అంటే, "కాశీలో కనిపించే ప్రతీ చిన్న రాయిలో కూడా శంకరుడుంటాడు" అని. అదే అంటున్నాడు కవి ఇక్కడ. ఎదురయే ఏ రాయైనా శివలింగమే. అలాగే, ఇక్కడి మట్టి కూడా ఆ శివుడి వరదానమే. ఎలాగంటారా! మరి ఆయన ఆనందంగా తలాడించబట్టే కదా, గంగ మహానదిగా ప్రవహించింది? మరి ఆ నది ప్రవహించబట్టే కదా ఒండ్రుమట్టి వచ్చి చేరింది? మరి ఆ మన్నే కదా మనమిక్కడ చూసేది. అలాగ.

చిరంజీవిగా నిలచింది ఈ నగరమే, చరితలకు అందనిది ఈ కైలాసమే

కాశీ చరిత్ర తెలిసిన వారెవరైనా ఇది అనాదిగా ఉన్న నగరమనీ, ఎవరు ఎన్నో రకాలుగా ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, మళ్ళీ పూర్వ వైభవంతో లేచి నిలబడుతోందనీ ఒప్పుకుంటారు. ఏడవ శతాబ్దపు చైనా యాత్రీకుడు హుయన్‌త్సాంగ్ ఈ ఊరిని ఒక మహానగరంగా వర్ణించేడు. భారతదేశం మీద పడ్డ ప్రతీ తురకతండా ఈ నగరాన్ని, విశ్వనాథుడి ఆలయాన్నీ ఏదో ఒక రకంగా ధ్వంసం చేసినవాళ్ళే. అయితే ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు కూలగొట్టినా మళ్ళీ తిరగకడుతున్నారనే అక్కసుతో దాన్ని పూర్తిగా నాశనం చెయ్యడమేగాక మళ్ళీ పునరుద్ధరించడానికి వీలులేదని ఆంక్ష పెట్టేడు సికందర్ లోఢి అనే ఒక తురక 1494లో. అయినా పూర్వవైభవం సంతరించుకుని మళ్ళీ నిలబడిందీ గుడి 1569లో. ఒక వందేళ్ళ తర్వాత ఔరంగజేబని మరో తురకొచ్చేడు. వాడేం చేసేడూ? దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసి దాని స్థానంలో ఒక మసీదు కట్టించేసేడు. కానీ క్షేత్రమహిమనెవరు తగ్గించగలరు? ఏభైయేళ్ళు తిరక్కుండానే, ఆ మసీదు పక్కనే మళ్ళీ విశ్వనాథుడి గుడి కట్టించింది రాణి అహల్యాబాయ్. మరి ఇలాంటి ఊరినీ, అక్కడ ఉన్న ఆలయాన్నీ చిరంజీవి అని అనకుండా ఎలా ఉండగలం?

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే, తరలి రండి, తెలుసుకోండి కాశిమహిమ

గంగానది గట్టుమీద నడుస్తూంటే, ఆగకుండా వినిపిస్తూంటుంది ఓంకారనాదం. ప్రశాంతమైన గంగాప్రవాహం మరి ఆ శివుడి కారుణ్యమే కదా. మరింకేం? బయల్దేరండి కాశీకి. వెళ్ళి తెలుసుకోండి ఆ క్షేత్రమహత్మ్యాన్ని.

ఒక పుణ్యతీర్థం గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పగలరండీ, ఒక్క సీతారామశాస్త్రిగారు తప్ప? అసలు ఈ పాట గురించి యోగి ఆదిత్యనాథ్ కో , లేక నరేంద్రమోదీకో తెలిస్తే, వాళ్ళు వెంటనే శాస్త్రిగారిని కాశీకి బ్రాండ్ ఎంబాసడర్ గా పెట్టేసుకుంటారు. శాస్త్రిగారికి శిరసా అభివందనాలు. 

Sunday, December 2, 2018

వేదవిద్యార్థులకి విన్నపం

అవలోకనమంటే చూడడం. ప్రత్యేకించి వెనక్కి లేదా క్రిందకి చూడ్డం.  దీనికి వ్యతిరేక పదం ఆలోకనం. అంటే ముందుచూపన్నమాట. సింహం తనదారిలో నడుస్తూ మధ్యలో ఆగి ఒక్కసారి అలా వెనక్కి చూస్తుంది. తనకి సంబంధించని వాళ్ళెవరైనా తనని రహస్యంగా అనుసరిస్తున్నారా, తనువెళ్లే దారి సరైనదేనా, ఇలాటి కారణాలవల్ల. అలాగే మనుష్యులు కూడా తామేదైనా చదవడమో , వ్రాయడమో, బొమ్మ గీయడమో, శిల్పం చెక్కడమో, లేదా ఇంకేదైనా పని చేసేటప్పుడో మధ్య మధ్యలో తాము చేసే పని ఎంతవరకూ అయిందో, అసలు సరిగా అవుతోందో లేదో అని తేఱిపాఱా చూసుకుంటారు. సింహంలాగే. దీన్నే సింహావలోకనమంటారు. ఉపమానం. అసలలా వెనక్కి తిరిగి చూసుకోక పోతే ఆ చేస్తున్నపని సరిగా అవదుకూడా.

ఈ సింహావలోకనమనేది పాతికేళ్ళు దాటిన పెద్దవాళ్ళు వేదపఠనం, స్తోత్రపాఠం లాంటివి నేర్చుకోవడం మొదలుపెడితే వాళ్ళకి కూడా చాలా అవసరం. క్రమశిక్షణా, మరియూ శుచీ పాటిస్తూ నేర్చుకూంటున్నామా, నేర్చుకున్న పాఠం స్వరబద్ధంగా చదవగల్గుతున్నామా, శబ్దాలని వక్రీకరణ చెయ్యట్లేదు కదా ! ఒత్తులూ, దీర్ఘలూ పెట్టవలసిన చోట పెట్టకుండా, పెట్టకూడని చోట పెట్టీ, చదువుతున్న మంత్ర, శ్లోకాల అర్థాలు మార్చేయట్లేదు కదా! ద్విత్త్వాక్షరాలు సరిగానే పలుకుతున్నామా?  స్వరిత దీర్ఘస్వరితాలూ, ఉదాత్తానుదాత్తాలు చూసుకునే కదా స్వరాలు పలుకుతున్నాం ! ఇలాంటి విషయాలన్నమాట.

అయితే దోషాల్లేకుండా చదువుతున్నామో లేదో మనందరికీ తెలియదు, తెలిసినా తప్పులొప్పుకుని సరిదిద్దుకోడానికి అహం అంగీకరించదు. ఉదాహరణకి చాలామంది లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుతారు. ఎంతో వేగం గానూ, ఎన్నో ఉచ్ఛారణ దోషాలతోనూ. "ఏవండీ, మీరు సరిగ్గా చదవట్లేదు, తప్పులు దొర్లుతున్నాయి" అని చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా చెప్పినా ఇవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం కూడా. అదే ఈ స్తోత్రాల గురించి తెలిసిన వాళ్ళెవరి దగ్గరైనా పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఉచ్ఛారణ దోషాలతోనూ, అపస్వరాలతోనూ చదవకుండా ఉండే అవకాశముంటుంది. అదేకాకుండా మనం ఇంతవరకూ నేర్చుకున్నది ఆ గురువు దగ్గరే ప్రదర్శించి చేస్తూన్న తప్పులూ సరిదిద్దుకోవచ్చు. స్తోత్రాల విషయంలో అయితే తప్పులు దిద్దుకోవడం సులువు. అదే వేదమంత్రాల విషయంలో ఒక్కసారి తప్పుగా చదవడం అలవాటైతే మళ్ళీ సరైన దార్లో పడడం చాలా కష్టంతో కూడుకున్న పని. వేదం నేర్చుకోవడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు కొన్నుంటాయి. ముందు సరైన ఉచ్ఛారణ ఉండాలి. ఉదాత్తానుదాత్తాలూ, స్వరితాలూ తెలుసుకోవాలి. శబ్దోచ్ఛారణలో ఏ అక్షరానికి ఎన్ని మాత్రల సమయం వినియోగించాలో నేర్చుకోవాలి. ఛందస్సులెన్నో, అవి ఏంటేంటో, ఒక్కొక్క ఛందస్సుకీ ఎన్ని అక్షరాలుంటాయో అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ మించి శుచి, క్రమశిక్షణ అవసరం. ఇవన్నీ కుదురుతే, అప్పుడు, మంత్రాలూ, సూక్తాలూ, నమక చమకాలూ నేర్చుకోవడం.

పూర్వకాలంలో వేదవిద్య గురుకులాల్లోనూ, ప్రత్యేకమైన వేద పాఠశాలల్లోనూ మాత్రమే నేర్పించేవారు. అయితే ప్రస్తుత కాలంలో గురుకులాలు అంతరించి పోయాయి. వేదపాఠశాలలు అక్కడక్కడ కొన ఊపిరితో కొట్టాడుతున్నాయి. ఇలాంటి వైదిక శిక్షణా కేంద్రాలలో విద్యార్థుల్ని ఏడెనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగిన తర్వాత చేర్చుకునేవారు. వాళ్ళకి ముందు ఉచ్ఛారణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో శబ్దమంజరి, అమరకోశం, చిన్న చిన్న వేదమంత్రాలు, నీతిశ్లోకాలు, మొదలైనవి భట్టీయం (బట్టీ పట్టించడం, లేదా ప్రస్తుత భాషలో పిడి కొట్టించడం) వేయించి, కంఠస్థం అయ్యేలా చేసేవారు. ఆ తర్వాత వయసుతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతూ ఉంటే అంతవరకూ నేర్చుకున్న వాటిని విపులీకరించడం, వ్యాకరణ సూత్రాలకర్థం చెప్పడం, మొదలైనవి జరిగేవి.ఈ క్రమంలో శాస్త్రాలు, వేదాలు సాంగోపాంగంగా ఉపనిషదర్థాలతో సహా నేర్పేవారు.

అయితే ఇప్పుడు జరిగేది వయోజన వేదవిద్య. మనమంతా అంతో ఇంతో చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుని పొట్ట పోసుకుంటూ ఎవరైనా నేర్పించే వాళ్ళుంటే వేదమంత్రాలు నేర్చుకోవాలనీ, మంత్రపుష్పమో, పురుషసూక్తమో, లేకపోతే సూటిగా రుద్రమే నేర్చేసుకుందామని ఉబలాటపడిపోతూంటాం. అమెరికాలాంటి విదేశాలలో ఉండేవాళ్ళకి పద్ధతిగా వేదం నేర్పించే వాళ్ళు దొరకడం అంత సులభం కాదు. చికాగో, ఫొయినిక్స్, లాస్ ఏంజెల్స్ లాంటి పెద్ద ఊళ్ళలో వేద పాఠశాలలూ, శిక్షణా కేంద్రాలూ ఉన్నా, అన్నిచోట్లా ఇలాంటి సౌకర్యముండదు. ఎవరో ఆముదం చెట్టులా ఆ మాత్రం తెలిసిన వాళ్ళుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మానికీ, వేదమాతకీ చేస్తూన్న హాని అంతా ఇంతా కాదు. వీళ్ళలో కొంతమందికి కచటతపలకీ గజడదబలకీ తేడా తెలీదు. కొంతమంది స్వరాలింటి దగ్గర మర్చిపోతారు. కొంతమందికి లింగ వచన విభక్తులంటే తెలియదు. కొంతమంది ఛందస్సంటే కస్సంటారు. ఇలాంటి భాషా జ్ఞానం, స్వరజ్ఞానం లోపించిన వాళ్ళు తప్పుడు పద్ధతిలో పదిమందికి నేర్పేస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్కళ్ళూ చెరో పదేసిమందికి నేర్పించేస్తున్నారు. వేల సంవత్సరాలనుంచీ పరంపరగా వస్తూన్న వైదిక శిక్షణా పద్ధతులిలా భ్రష్టు పట్టిపోవడం బాధాకరమైన విషయమే.

ఈ మధ్య ఇంకొక ఘోరం చూడాల్సొచ్చింది. ఒకాయననున్నాడు. 25 - 35 ఏళ్ళ వయసుంటుంది. ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఆంజనేయ భక్తుడు. గంటల తరబడి పాడగలడు. మంచి గొంతు, లయజ్ఞానం ఉన్నాయి. కంజీర, గొట్టువాద్యం చాలా బాగా వాయిస్తాడు. హనుమాన్ చాలీసా, రామదాసు కీర్తనలూ, త్యాగరాయ కీర్తనలూ, కంఠస్థం. మంచి శిష్యగణం కూడా ఉంది. ఊళ్ళో ప్రజల ఇళ్ళల్లో హనుమాన్ భజనలూ అవీ చేస్తాడు. చాలా మంచివాడు కూడా. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఆయన వేదం ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం నేర్చుకున్నట్టనిపించదు. అయినా సూక్తాలూ, నమకమూ చమకమూ అతనిష్టం వచ్చినట్టు స్వరం మార్చీ, శబ్దాలు మార్చీ చదివేస్తాడు, పైగా అదే పద్ధతిలో శిష్యులకి నేర్పించేస్తాడు కూడా. ఇదంతా సరిపోకుండా జనం ఇళ్ళల్లో హనుమంతుడికి అభిషేకాలు చేయిస్తాడు. హనుమంతుడు భజనప్రియుడే. ఆయనకి భజన ఎలా అయినా చెయ్యొచ్చు. కానీ అభిషేకం అంటే వేరు కదా. దానికి ఒక పద్ధతీ, ఒక మర్యాదా ఉంటాయి. వేదప్రోక్తంగా, ఎంతో నిష్ఠగా ఇంటి యజమాని, అతని భార్య చేతా చేయించాల్సింది. అంతేకానీ రామదాసు కీర్తనలనిష్టం వచ్చిన వరసలో పాడేస్తూ, డప్పు వాయిస్తూ, చూడ్డానికొచ్చిన వాళ్ళు శుచిగా ఉన్నారో లేదో, అసలు స్నానం కూడా చేసేరో లేదో తెలుసుకోకుండా ఆంజనేయుడి మూర్తికి పంచామృతాలతోనూ, పానీయాలతోనూ అభిషేకం చేయించేయడం ఎంతవరకూ సబబో ఆయనకే తెలియాలి. ఇంక అది సరిపోక నమక చమకాలతో కూడా అభిషేకం మొదలుపెట్టేడు. కానీ స్వరయుక్తంగా చదవాలనే విషయాన్ని విస్మరించేడు. ఆశయం మంచిదే. ఆచరణ విషయంలోనే కొంచెం తప్పు జరుగుతోందనిపిస్తుంది.

విషయానికొస్తే, వైదిక, ధార్మిక విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళూ, వేదమంత్రాలు చదవడం నేర్చుకోవాలనుకునే వాళ్ళూ, కొన్ని విషయాలు పాటిస్తే బాగుంటుంది. నేర్చుకోవాలనే ఆత్రుతలో ఎవర్ని పడితే వాళ్ళని ఆశ్రయించకండి. మీ పిల్లల్ని కేజీ స్కూల్లో వేసేముందు, ఆ బడి గురించీ, టీచర్ల గురించీ విచారిస్తారా లేదా? ఏదైనా యూనివర్సిటీలోనో లేదా కమ్యూనిటీ కాలేజ్ లోనో కోర్స్ రిజిస్టర్ చేసుకునే ముందు ఆ ఇన్స్ట్రక్టర్ ఎలాంటివాడో తెలుసుకుంటామా లేదా? అలాగే, వేదం నేర్పించే గురువు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు నేర్చుకున్నదంతా అపస్వరాలతోనూ, వ్యాకరణదోషాలతోనూ నిండి ఉండే ప్రమాదం ఉంటుంది.  అలా నేర్చుకున్నది ఏ గుళ్ళోనో, లేదా ఇంకెవరి సమక్షంలోనో శ్రవణం చేస్తే, వినేవాళ్ళకి అంతో ఇంతో వేదం తెలుస్తే, వాళ్ళకి మీ దోషభూయిష్టమైన వేదఘోష విని కడుపులో దేవినట్టవుతుంది. అది మీకూ, వాళ్ళకీ ఇద్దరికీ మంచిది కాదు.

అదే ఒక మంచి గురువుగారి దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టేరనుకోండి. ఆయన మీకు ఒక పద్ధతిలో నేర్పిస్తారు. ఉచ్ఛారణ, స్వరం, భాష, భావన ఇలా అన్నీ బాగుంటాయి. అయితే అందరు గురువులకీ అన్నీ తెలియాలని లేదు. వాళ్ళకి తెలియని విషయాలని మాటిమాటికీ అడిగి వాళ్ళనిబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. కాని నేర్చుకున్న వేదమంత్రాలకి వీలయినంతవరకూ అర్థం తెలుసునే ప్రయత్నం చేస్తే మంచిది. వేదాలకర్థం తెలియడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. విశాల భారతంలో వేదపండితులూ, భాష్యకారులూ చాలామందే ఉన్నారు. వాళ్ళనీ, వాళ్ళు వ్రాసిన భాష్యగ్రంథాల్నీ శోధించి సాధించాలి.

సంస్కృతభాష నేర్చుకోండి. అంతే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. భాష తెలియకపోతే భావమర్థమవదు. అర్థం కాని చదువు వ్యర్థం అని తెలుగు సామెత. అలాగే సంస్కృతంలో ఒక మంచి సుభాషితముంది.

యథా ఖరశ్చందనభారవాహీ, భారస్య వేత్తా న తు చందనస్య
ఏవం హి శాస్త్రాణి బహు న్యధీత్య, చార్థేషు మూఢా: ఖరద్వహంతి

అర్థమేంటంటే, మంచిగంధం చెక్కలు మోసుకెళ్ళే గాడిదకి ఆ చెక్కల బరువైతే తెలుస్తుంది కానీ, ఆ గంధ పరిమళం మాత్రం తెలియదు. అలాగే ఎన్నో శాస్త్రాలు చదివినవాళ్ళు కూడా అర్థం తెలియకపోతే అలాంటి గాడిదతో సమానం.

పైన చెప్పిన విషయాన్నే, లలితాసహస్రనామస్తోత్రానికి భాష్యం వ్రాసిన ప్రసిద్ధ పండితులైన భాస్కరాచార్యులు గారు ఆయన వ్రాసిన "శ్రీ వరివస్యా రహస్యం" అనే గ్రంథంలో 54, 55 శ్లోకాలలో ఈ క్రింది విధంగా అంటారు.

    నా2ర్థజ్ఞానవిహీనం శబ్దస్యోచ్ఛారణం ఫలతి |
    భస్మని వహ్నివిహీనే, నప్రక్షిప్తం హవిర్జలతి || 54 ||      

    అర్థమాజానానానాం, నానావిధ శబ్దమాత్ర పాఠవతాం |
    ఉపమేయశ్చక్రీవానా, మలయజ భారస్య వోఢైవ || 55 ||

అర్థం

54. అర్థం తెలియని వారికి వాళ్ళు చేసే శబ్దోచ్ఛారణ ఫలించదు.
బూడిదలో హవిస్సు కలిపితే అగ్ని జ్వలించదు కదా!

55. అర్థం తెలియకుండా రకరకాల శబ్దాల్ని మాత్రం పఠించేవాళ్ళు గంధపుచెక్కలు మోసే గాడిదతో పోల్చదగినవారు.

ఒక్క విషయం. వేదమంత్రాలకర్థం గూగుల్ లో మాత్రం వెతకొద్దండి. గూగుల్ అన్ని విషయాలలో మేలు చేసినా సనాతన ధార్మిక విషయాలలో మాత్రం అది చేసే కీడే ఎక్కువ.

ఒక శ్లోకం గానీ, సూక్తంగానీ, మాట గానీ, మంత్రం గానీ, ఏదైనా సరే, మీకు "క్షుణ్ణంగా" తెలియక పోతే ఇంకొకరికి నేర్పించవద్దు. దీనివల్ల మీరు వాళ్ళకి మేలు చేయకపోగా, కీడు మాత్రం చాలా చేస్తున్నారు.

సెలవు.