అష్టావధానం -- ఒక పరిచయం
Ashtavadhanam - An Introduction
అవధానం అంటే ఏకాగ్రత, హెచ్చరిక అని నిఘంటువు చెబుతుంది. సాహిత్యపరంగా చూస్తే ఎంతో జాగరూకతతో, ఏకాగ్రతని నిలుపుకుంటూ పృచ్ఛకులు(పృచ్ఛ చేసేవారు, అనగా ప్రశ్నవేసేవారు అని అర్ధం) అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారిని సంతృప్తి పరచే వారిని అవధాని అంటారు.ఇది ఒక గొప్ప సాహిత్యప్రక్రియ. అవధానికి ఎంతో ఏకాగ్రత, సమయస్ఫూర్తి, ఓర్పు, పాండిత్యం కావాలి. మంచి మాటకారితనం ఉండాలి. ఒక మంచి కవియై, ఎటువంటి విషయంలోనైనా అడిగిన విషయం మీద కావలసిన ఛందోవృత్తంలో ఆశువుగా పద్యాలు శ్రావ్యంగా వినిపించగలిగి ఉండాలి. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడే శక్తి కావాలి.
అన్నిటికీ మించి మంచి ధారణశక్తి చాలా అవసరం. ఇది ఏ కొద్దిమందో తప్ప ప్రదర్శించలేని విద్య.
అష్టావధానంలో ఎనిమిది అంశములుంటాయి. వీటిలో కనీసం ఐదు సాహితీ పరమైనవైతే మిగతా మూడూ లౌకిక సంబంధమైనవుండొచ్చు. అసలు పూర్వకాలంలో అవధానమంటే శతావధానమే. అష్టావధానం ప్రాచుర్యం పొందినది ఆథునిక కాలంలో తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరకవులు మొదలైన వారివల్ల. తిరుపతి వేంకట
కవులు ఈ అష్టావధానానికి కొన్ని లక్షణాలు నిర్దేశించి ఈ క్రింది విధంగా చెప్పేరు.
పౌరాణోక్తి కవిత్వ పుష్పగణనా వ్యస్తాక్షరుల్ లౌక్య గం
భీరోక్త్యంచిత కావ్యపాఠన కళావిద్భాషణంబుల్ ముదం
బారంగా చతురంగఖేలనము నీ యష్టప్రచారంబు లొ
ప్పారున్ శంకర! యేకకాలముననే యష్టావధానమ్మునన్
పై పద్యం ప్రకారం అష్టావధాన ఆంశాలు ఇవి:
పురాణపఠనము, కవిత్వము, పుష్పగణనము, వ్యస్తాక్షరి, లోకాభిరామాయణము, కావ్యపాఠనము, శాస్త్రార్థము,
మరియు చదరంగము.ఈ అంశాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నిషేధాక్షరి, నిర్దిష్టాక్షరి, అప్రస్తుత ప్రసంగం, సమస్యా పూరణం, దత్తపది, ఆంధ్రీకరణ, ఏకసంథాగ్రాహము, మొదలైన అంశాలు కూడా చేర్చ బడతాయి. ఉదాహరణకి ఒక అస్టావధానంలో ఈ క్రింది అంశాలున్నాయనుకుంటే, వాటి ప్రాముఖ్యత ఏమిటో, అవధాన విధానం ఎలాగుంటుందో చూద్దాం.
1.
వర్ణన లేదా కవిత్వం: పృచ్ఛకుని కోరిక ప్రకారం, వారు ఎన్నుకున్న విషయం లేదా వస్తువు మీద, వారికి నచ్చిన వృత్తంలో, ఒక పద్యం చెప్పడం. ఈ అంశం ద్వారా అవధాని ఆశు కవితాధార ఎంత గొప్పదో తెలుస్తుంది.
2.
వ్యస్తాక్షరి: పృచ్ఛకుడు తనకు తెలిసిన పద్యాన్ని గాని, పాటని గానీ, శ్లోకాన్ని గాని, అక్షరాలుగా విడగొట్టి, వాటి స్థానాల సంఖ్యల్ని ఒక్కొక్కటిగా చీటీ మీద వ్రాసి అవధానికి అందిస్తే, వారు ఆ వ్యస్తం (తారుమారు) అయిన అక్షరాలని ఒక క్రమంలో కూర్చి పద్యాన్ని చదివి చెప్తారన్నమాట. దీనివలన అవధాని ధారణశక్తి, అస్తవ్యస్తమైన పద్యం తిరిగి కూర్చగల మేథాశక్తి వ్యక్తమౌతుంది. ఉదాహరణకి, క్రింది అక్షరాలు వాటి స్థాన సంఖ్యలతో కలిపి చూపించిన వరుసలో అవధాని గారికి కార్యక్రమం పొడుగునా ఇస్తూ వెళితే, వారు ఆ కాగితాన్ని చూసి, సభాసదులకి అందులో ఉన్న అక్షరమూ, స్థానసంఖ్యా ప్రకటించి, చివర్లో ఆ పద్యమేమిటో, చెబుతారు. పై(19), క((11), ణి(5), తం(16), వీ(4), న(10), న(20), పై(7), ఖ(15), శ(3), ర(12), త్రు(17), య(6), మ(13), ప్రా(1), ల(18), యూ(14), న(8), గ్ది(2), ది(9).
3.
సమస్యాపూరణం:పదాలని ఎక్కడా పొసగని విధంగా ఒక పాదాన్ని అవధానిగారికిస్తే వారు మిగిలిన పాదాలు కూర్చి ఆ పద్యాన్ని అర్ధవంతంగా చేసి వినిపిస్తారు. ఉదాహరణలు: 1. కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్; 2. సొరపాదున బీరకాయ సొంపుగ గాచెన్; 3. అస్ఖలిత బ్రహ్మచారికార్గురు పుత్రుల్.
4.
నిషిద్ధాక్షరి: పృచ్ఛకుడు ఇచ్చిన విషయము మీద అవధానిగారు ఒక నిర్దిష్టమైన వృత్తంలో పద్యం చెప్పాలి. అవధానిగారు ఒక పదమనుకుని అందులో ఒక అక్షరం వెల్లడి చేస్తారు. పృచ్ఛకుడు ఆ పదాన్ని ఊహించి తర్వాత వచ్చే అక్షరాన్ని నిషేధిస్తాడు. ఇలాగ నిషేధిస్తూ వచ్చిన అక్షరాలని వదలిపెట్టి అర్ధవంతంగా పద్యం చెప్పగలగాలి. యతి స్థానంలో మాత్రం అవధాని
కి నిషేధాలేవీ కల్పించకూడదు.
5.
దత్తపది: పృచ్ఛకుడిచ్చిన పదాలు వచ్చేటట్లుగా కోరిన వృత్తంలో పద్యం చెప్పాలి. అవధాని గారి భావ పరిపుష్టికి అద్దం పట్టే అంశమిది. ఉదాహరణకి, ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు అనే నాలుగు పదాలున్నట్లుగా ఒక పద్యం చెప్పాలి:
ఇఱుకరాదుచేత నుసుమంత నిప్పైన
గొఱుకరాదు ఇనుము కొంచమైన
నఱుకరాదు నీరు నడిమికి రెండుగా
బెఱుకరాదు బావి పెల్లగిలగ
6.
ఆకాశపురాణం: ఏదైనా పురాణము నుండి తీసిచ్చిన కథాంశాన్ని తీసుకుని సొంత పద్యాల్లో వివరిస్తూ పురాణం చెప్పినట్లు వ్యాఖ్యానించడం. దీనివల్ల అవధాని గారి పౌరాణిక పరిజ్ఞానం ఎంతో తెలుసుకోవచ్చు.
7.
అప్రస్తుత ప్రసంగం: ఈ పృచ్ఛకుడు అవధానిగారికి అడుగడుగునా అడ్డుపడుతూ అసందర్భమైన లౌకిక విషయాల మీద ప్రశ్నలు వేస్తూంటాడు. మిగతా అంశాలమీద ఏకాగ్రత చెడకుండా ఈ పృచ్ఛకుడితో సంభాషించాలి.
8.
ఘంటాగణనం: ఒక పృచ్ఛకుడు అవధానం మొదలు నుండీ చివరి వరకూ అప్పుడప్పుడుగా గంటలు వాయిస్తూంటాడు. అవధానం సమాప్తమైన తరువాత మొత్తం ఎన్నిసార్లు గంట వాయింపబడిందో చెప్పగలగాలి.
పైన చెప్పిన విధంగా అవధానం చేసిన వారికి బుద్ధిబలం, ఆశుధార, ధైర్యస్థైర్యాలు, శాస్త్రజ్ఞానం, మొదలైనవి ఎంతగా ఉండాలో ఆలోచించుకోవచ్చు.
పనికొచ్చిన గ్రంథములు:
1. బూదరాజు రాధాకృష్ణ గారి తెలుగులో సమస్యాపూరణలు
2. బూదరాజు రాధాకృష్ణ గారి తెలుగు సంగతులు
3. ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 4వ సంపుటి
4. 150 వసంతాల వావిళ్ళ వాజ్ఙయ వైజయంతి
5. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటుపద్య రత్నాకరము
6. బహుజనపల్లి సీతారామాచార్యులుగారి శబ్దరత్నాకరము
పద్యం లో ఉన్న చతురంగ ఖేలనము మీ వ్యాసం లో ఉటంకించినట్టు లేరండీ
ReplyDeleteనమస్కారమండి. పద్యంలో ఉన్న అంశాలేమిటో ఈ క్రింది విధంగా వివరించేనండి. అయితే, మిగతా అంశాలకు ఇచ్చినట్లు వివరణ, ఉదాహరణలు ఇవ్వలేదు. ఎందుకంటే చదరంగం అందరికీ తెలిసిన ఆటే కదాని.
Deleteపై పద్యం ప్రకారం అష్టావధాన ఆంశాలు ఇవి:
పురాణపఠనము, కవిత్వము, పుష్పగణనము, వ్యస్తాక్షరి, లోకాభిరామాయణము, కావ్యపాఠనము, శాస్త్రార్థము, మరియు చదరంగము.ఈ అంశాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నిషేధాక్షరి, నిర్దిష్టాక్షరి, అప్రస్తుత ప్రసంగం, సమస్యా పూరణం, దత్తపది, ఆంధ్రీకరణ, ఏకసంథాగ్రాహము, మొదలైన అంశాలు కూడా చేర్చ బడతాయి. ఉదాహరణకి ఒక అస్టావధానంలో ఈ క్రింది అంశాలున్నాయనుకుంటే, వాటి ప్రాముఖ్యత ఏమిటో, అవధాన విధానం ఎలాగుంటుందో చూద్దాం.
Thank you sir for sharing valuable information. We are accustomed to enjoy ASHTAVADHANAM while performing by
Deleteeminent scholars but we don't know the details. Kindly continue in future also.
Regards,
Manohara Reddy,Lavanya.
నమస్కారమండి. అవునండి, చక్కగా అన్నీ ఉటంకించారు, సగం నిద్రలో చదివి ముప్పాతిక నిద్రలో ఉన్నప్పుడు వ్యాఖ్య పెట్టినట్టున్నాను.
ReplyDeleteమన్నించండి.