Pages

Friday, July 26, 2019

యాగార్థం

స్వగతం
ఒక సెలవు దినం పొద్దున్న కాఫీ తాగుతూ వర్ణన రత్నాకరం 19వ సంపుటి పుటలు తిరగేస్తున్నాను. ఇది ఒక విలక్షణమైన గ్రంథం. 1930లలో దాసరి లక్ష్మణకవి గారనే సాహిత్యవేత్త ఒకాయన ఒకే వస్తువును గానీ, విషయాన్ని గానీ వేర్వేరు కవులు ఏయే రకాలుగా వర్ణించేరో పరిశోధన చేసి అలాంటి పద్యాలన్నిటినీ ఒక చోట కూర్చి, పొందికగా సంకలనం చేసి నాలుగు సంపుటాలుగా ప్రచురిస్తే, ఇది జరిగిన సుమారు తొంభై సంవత్సరాలకి, హైదరాబాదు విశ్వవిద్యాలయం వాళ్ళు, ఎమెస్కో వాళ్ళు కలిసి, బేతవాలు రామబ్రహ్మం గారు, అద్దంకి శ్రీనివాస్ గారు, మొదలైన తెలుగు పండితులచేత ఈ పద్యాలన్నిటినీ పునస్సంకలనం చేయించి, టీక, తాత్పర్యాలతో సహా ఇరవై మూడు భాగాలుగా, ఒక్కొక్క భాగం ₹200 చొప్పున తెలుగు భాషాభిమానులకి అందజేస్తున్నారు. శెలవునాడు ఇలాంటి పుస్తకాలు కాని చదవడం మొదలుపెడితే అది ఎంతదాకా వెళ్తుందో చెప్పలేం. సరే, ఆ శనివారం పొద్దున్న యజ్ఞాదికం, అంటే యజ్ఞం, దానికి సంబంధించిన విషయాల మీద పద్యాలు చదువుతున్నాను. ఈ పద్యాలన్నీ ఏవేవో కావ్యాలు, ప్రబంధాల నుంచి సంగ్రహించబడినవి. ప్రతీ పద్యం చివర అది ఏ గ్రంథం లోనిదో, ఆ విషయం కూడా రాసేరు. అదిగో అలాంటి పద్యాల్లో ఈ అందమైన కందమొకటి.
కం. యాగార్థ మడిగి నర్థము
యాగమునకుఁ బెట్టవలయు నడియరియై తా
భోగార్థముగా దాఁచిన
యాగమబాహ్యుండు కాకియై జన్మించున్
విజ్ఞానేశ్వరీయం, ఆచా., 87
ఏదైనా యాగం చెయ్యాలని తలపెట్టి దానికి కావలసిన ధనసామగ్రులను విరాళంగా సేకరించి, అలా సేకరించిన వాటిని ఆ యజ్ఞానికి వాడకుండా, లోభంతో (అడయరియై) స్వంతానికి దాచుకున్న వాడు ధర్మం తప్పినవాడై (ఆగమబాహ్యుడు) తర్వాత జన్మలో కాకిగా పుడతాట్ట.
ఇది విజ్ఞానేశ్వరీయం, ఆచారకాండలో 87వ పద్యంట. సరే, ఈ విజ్ఞానేశ్వరీయం గురించి తెలుసుకోవాలని ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం తిరగేస్తే తెలిసిన విషయాలిలా ఉన్నాయి.
పదమూడవ శతాబ్దపు కవి (తిక్కనకి సమకాలికుడు) మూలఘటిక కేతన గారు రచించిన గ్రంథమిది. అయితే, ఈ కేతనగారికో కథ ఉంటే, ఆయన వ్రాసిన విజ్ఞానేశ్వరీయానికి సంస్కృత మాతృక మితాక్షర వెనక ఇంకా పెద్ద కథ ఉంది. సరే అభినవ దండి బిరుదాంకితుడైన కేతన గారి గురించి మళ్ళీ ఎప్పుడైనా. ముందు మితాక్షర గురించి చెప్పుకుందాం.
ప్రాచీన భారత ఋషులలో యాజ్ఞ్యవల్క్యుడు ఒకడు. శుక్ల యజుర్వేదంలో ఈయన దర్శించిన వేదమంత్రాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మహాభారతంలోనూ, అనేక పురాణాల్లోనూ ఈయన ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది. ఈయన గురించి వివరంగా ఇంకెప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ ఋషి మనకందించిన ఒక ప్రముఖ గ్రంథం "యాజ్ఞ్యవల్క్య స్మృతి" అనే ధర్మశాస్త్రం. దీన్ని తెలుగులో సరళ వచనంలో అందరికీ అర్థమయ్యేట్లు అనువదించిన వాళ్ళలో పుల్లెల రామచంద్రుడు గారు ఒకరు. ఈ స్మృతికి చాలా మంది భాష్యాలు వ్రాసినా, 12వ శతాబ్దపు విజ్ఞానేశ్వరుడు అనే యోగి రచించిన మితాక్షర చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు కాండలున్నాయి. ఆచారకాండ, వ్యవహార కాండ, ప్రాయశ్చిత్త కాండ. అదిగో, ఆ ఆచారకాండలోదే నేను చూసిన పై పద్యం.
ఆచారకాండ: సభ్య సమాజంలో ఒక మనిషి చెయ్యవలసినవీ, చెయ్యకూడనివీ (Do's & Dont's) అయిన పనులన్నీ (ఆచారాలు) వివరంగా చెప్పిన కాండ ఇది.
వ్యవహార కాండ: ఒకరు చేసిన పనుల వల్ల ఇంకొకరికి కలిగే కష్టనష్టాల మీద పాలకులు జరపవలసిన న్యాయ విచారణ (Trial & Investigation) . ఇదే వ్యవహారం.
ప్రాయశ్చిత్త కాండ: .నేరనిర్ధారణ జరిగిన తర్వాత అమలుపరచవలసిన శిక్ష, ప్రాయశిత్తం, వాటి వివరాలు.
అయిపోయింది శనివారం సెలవు.

No comments:

Post a Comment